Vallabhaneni Vamsi Health: వల్లభనేని వంశీకి మరోసారి అస్వస్థత.. గుంటూరు ఆస్పత్రికి తరలింపు!

Vallabhaneni Vamsi Falls Sick: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం వంశీ అస్వస్థతకు గురవడంతో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.
తాజాగా వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం పోలీసులు ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వంశీకి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలోనే పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో వంశీకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. వంశీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలుసుకుని వంశీ కుటుంబీకులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.