UPI New Rules from August 1st: ఆన్ లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్!
UPI New Rules 2025 from August 1st: 2025లో యూపీఐ (UPI)కొత్త నియమాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇవి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు కొన్ని మార్పులను తీసుకొస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ఈ నియమాలను ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశ్యం యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడమే. ఈ మార్పులు సైబర్ మోసాలను నివారించడం, లావాదేవీలలో లోపాలను తగ్గించడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మొబైల్ నంబర్ రివోకేషన్ లిస్ట్ (MNRL/DIP)వాడకం
ఆగస్టు 1,2025 నుండి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ (PSPs) వారి డేటాబేస్ను వారానికి ఒకసారి మొబైల్ నంబర్ రివోకేషన్ లిస్ట్/డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ (MNRL/DIP) ద్వారా అప్డేట్ చేయాలని NPCI ఆదేశించింది. ఈ నియమం యూపీఐ ఐడీలకు లింక్ చేయబడిన వినియోగంలో లేని మొబైల్ నంబర్ల వల్ల లావాదేవీలలో ఏర్పడే లోపాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. టెలికాం సంస్థలు 90 రోజులు ఉపయోగించని మొబైల్ నంబర్లను రీసైకిల్ చేస్తాయి. ఇవి కొత్త కస్టమర్లకు కేటాయించబడతాయి. ఈ ప్రక్రియ వల్ల పాత నంబర్లకు లింక్ అయిన యూపీఐ ఐడీలతో సమస్యలు తలెత్తుతాయి. ఇది సైబర్ మోసాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ నియమం ద్వారా.. బ్యాంకులు కస్టమర్లు వాడని ఫోన్ నంబర్లను తొలగించి, లావాదేవీల భద్రతను పెంచుతాయి. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ కులింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోవాలి.
నాన్-ఫైనాన్షియల్ APIలపై పరిమితులు
ఆగస్టు 1 నుండి NPCI నాన్-ఫైనాన్షియల్ APIల (బ్యాలెన్స్ చెక్, లావాదేవీ స్థితి, లింక్డ్ ఖాతాల సమీక్ష) ఉపయోగంపై పరిమితులు విధించింది. కస్టమర్లు రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పరిమితులు సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. ఈ మార్పులు యూపీఐ సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచుతాయి.
కస్టమర్ల, బెనిఫిషియరీ పేరు ప్రదర్శన
జూన్ 30..2025 నుండి అమలులోకి వచ్చిన నియమం ప్రకారం.. యూపీఐ యాప్లు లావాదేవీల సమయంలో బెనిఫిషియరీ యొక్క అసలు బ్యాంక్ పేరును మాత్రమే ప్రదర్శించాలి. వినియోగదారు పేర్లు లేదా QR కోడ్ నుండి తీసిన పేర్లను చూపించకూడదు. అలాగే.. బెనిఫిషియరీ పేరును సవరించే ఫీచర్ను నిలిపివేయాలి. ఈ నియమం లావాదేవీలలో పారదర్శకతను పెంచుతుంది. అంతే కాకుండా తప్పుడు లావాదేవీలను నివారిస్తుంది.
ఇంటర్ఛేంజ్ ఫీజు, లావాదేవీ పరిమితులు
2025లో.. యూపీఐ లావాదేవీలకు రోజువారీ పరిమితి ₹1 లక్షగా ఉంటుంది. కానీ కొన్ని రకాల లావాదేవీలకు (క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, విదేశీ రెమిటెన్స్) ₹2 లక్షల వరకు అనుమతించబడతాయి. హాస్పిటల్స్ ,విద్యా సంస్థలకు చెల్లింపుల కోసం పరిమితి ₹5 లక్షలకు పెంచబడింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా ₹2,000 పైన లావాదేవీలకు 0.5% నుండి 1.1% వరకు ఇంటర్ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. ఇది వ్యాపారులు భరించాలి. వినియోగదారులు కాదు.
సెక్యూరిటీ ఆడిట్లు
ఆగస్టు 31, 2025 నాటికి CERT-In ఆమోదిత ఆడిటర్లు అన్ని యూపీఐ సంబంధిత బ్యాంకుల బ్యాకెండ్ సిస్టమ్లను సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేయాలి. ఈ ఆడిట్లు సిస్టమ్ భద్రతను మెరుగుపరచడం. అంతే కాకుండా సైబర్ మోసాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కస్టమర్లు చేయవలసినవి
కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోవాలి. ఒకవేళ నంబర్ పనిచేయకపోతే.. దాన్ని రీయాక్టివేట్ చేయాలి లేదా కొత్త నంబర్తో బ్యాంక్ రికార్డులను అప్డేట్ చేయాలి. యూపీఐ యాప్లలో రీ-రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
ఈ నియమాలు యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. అయితే కస్టమర్లు తమ వివరాలను అప్డేట్గా ఉంచడం ముఖ్యం.