Published On:

Covid-19 Case in Visakha: విశాఖలో నమోదైన కరోనా.. కడపలో మరొకరికి!

Covid-19 Case in Visakha: విశాఖలో నమోదైన కరోనా.. కడపలో మరొకరికి!

Covid-19 Positive Case Register in Visakha: దేశంలో కరోనా కలవరపెడుతోంది. పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా విశాఖలో వెలుగు చూశాయి. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్ వచ్చింది. మహిళను వారం రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

కాగా కరోనా పాజిటీవ్ గా తేలిన మహిళకు వారం రోజులుగా ఆర్యోగం బాలేదు. మహిళకు మాములు జ్వరం అనుకున్నా తగ్గలేదు. దీంతో మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసినా అందులో నెగటీవ్ తేలింది. చివరకు కొవిడ్- 19 పరీక్షలు చేయగా అందులో పాజిటీవ్ వచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమెను డిశ్చార్జ్ చేసి వారం రోజులపాటు ఇంట్లోనే ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన పరిసర ప్రాంతాల్లో మూడు బృందాలతో ఇంటింటి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

కరోనా కేసులు ఏపీ వాసులను మరింతగా కలవరపెడుతున్నాయి. విశాఖలోని మద్దిలపాలెంకు చెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే.. తాజాగా కడపలో మరో కరోనా కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ కడప రిమ్స్ లో చేరింది. ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటీవ్ గా గుర్తించారు. కాగా కరోనా బాధితురాలు నంద్యాల జిల్లాలోని చాగలమర్రి. మహిళ వయస్సు 70 ఏళ్లు ఉంటాయని చెప్పారు. నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు వివరించారు. కరోనా పాజిటీవ్ రావడంతో రిమ్స్ వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కొవిడ్ బాధితుల కోసం 20 బెడ్లను సిద్ధం చేశామన్నారు.