Covid- 19: దేశంలో తగ్గని కరోనా ఉధృతి.. 6 వేలకు దగ్గరగా కేసులు
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. పైగా రోజురోజుకు మరింతగా విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో 391 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5,755 కు చేరింది. ఓవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటున్నా భారీగా కేసులు బయట పడడం గమనార్హం.
అయితే దేశంలో ఉన్న 5755 యాక్టీవ్ కేసులలో అత్యధిక కేసులు కేరళలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 1806 యాక్టీవ్ కేసులు ఉండగా, గుజరాత్ 717, ఢిల్లీ 665, వెస్ట్ బెంగాల్ 622, మహారాష్ట్ర 577, కర్ణాటక 444 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలోనూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 10 కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 10కి చేరింది. ఇక తెలంగాణలోనూ 9 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాలు వెల్లడించింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు చనిపోయారు. ఇందులో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 59కి చేరింది.