Asaduddin Owaisi Comments: అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. మోదీ, పవన్, చంద్రబాబులపై విమర్శలు

Asaduddin Owaisi Comments on Chandrababu, Modi and Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింల ద్రోహి అని ఆయన పాలనలో ముస్లింల అన్యాయం ఎక్కువైందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని, రాజకీయాల్లో పెద్ద పెద్ద నేతలు కూడా వెళ్లిపోతున్నారని అన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హీరో అయితే.. తాను అతని కంటే పెద్ద హీరోనని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధికి తాము కూడా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్, వారి పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తమకు మద్దతిచ్చారని కొనియాడారు. టీటీడీలో అన్యమతస్తులకు ప్రవేశం లేదని చట్టం తీసుకురావడం ఏ మేరకు సమంజసమోనని ప్రశ్నించారు. మరి వక్ఫ్ బోర్డులోకి అన్యమతస్తులను ఎలా అనుమతిస్తారని నిలదీశారు.