Israel Strikes Iran: ఇరాన్ పై యుద్దంపై నెతన్యాహు క్లారిటీ
Israel Strikes Iran: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్లోని అనుమానాస్పద అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి.. తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేల మట్టం చేయాలని నిర్ణయించి.. ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పష్టం చేశారు. తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టామని నెతన్యాహు బహిరంగ ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్ ఫోర్స్ అగ్ర నాయకత్వం చాలా వరకు తుడిచి పెట్టుకుపోయింది. ఐఆర్జీసీ ఎయిర్ కమాండ్లోని అధికారులు భూగర్భ బంకర్లో ఓ సమావేశం నిర్వహిస్తుండగా.. ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఆ సంస్థ నాయకులు మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. తమ వాయుసేన జరిపిన దాడిలో నతాంజ్ అణు శుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఈ కేంద్రంలోని అండర్ గ్రౌండ్ నిర్మాణాలు.. ముఖ్యంగా పెద్దసంఖ్యలో సెంట్రిఫ్యూజ్లు ఉన్న బహుళ అంతస్తులు, ఎలక్ట్రికల్ రూమ్లు, ఇతర సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నట్లు తెలిపారు.
మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా ఇరాన్ 100కి పైగా డ్రోన్లను ప్రయోగించింది. షహీద్-136 శ్రేణికి చెందిన డ్రోన్లు ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి.