Uttam : రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

Minister Uttam kumarreddy : శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం పనుల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. మిగిలిన 9కిలోమీటర్ల సొరంగం పనులు రెండేళ్లలో పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. బుధవారం రక్షణ మంత్రిత్వశాఖతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి సహకారం కావాలని కోరారు. దానికి అంగీకరించినట్లు చెప్పారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున హెలికాప్టర్ సర్వే చేసి, తదుపరి పనులు మొదలు పెట్టాలని చూస్తున్నామని తెలిపారు.
ఆర్మీలో ఉన్న కల్నల్ పరీక్షిత్ మెహరా, సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్ను డిప్యూటేషన్పై రాష్ట్రానికి పంపేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. పరీక్షిత్ మెహరాను ప్రత్యేక కార్యదర్శిగా, జనరల్ హర్పాల్సింగ్ని గౌరవ సలహాదారుగా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీరి సహకారంతో తెలంగాణలో చేపట్టిన అన్ని సొరంగాల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పరికరాలు తీసుకువస్తున్నామని వివరించారు. వీటి ద్వారా 44 కిలోమీటర్ల సొరంగం భూమిపై నుంచి, భూమి లోపల కిలోమీటరు వరకు పరిస్థితి తెలుసుకుని చర్యలు చేపడుతామన్నారు. సర్వే ద్వారా సొరంగం వాస్తవ పరిస్థితి అంచనా వేయొచ్చన్నారు. హెలికాప్టర్కు లైడార్ ఏర్పాటు చేసి సర్వే చేస్తామని వివరించారు. వైమానిక దళ హెలికాప్టర్లు, పవన్ హన్స్ హెలికాప్టర్ల సాయం అడినట్లు తెలిపారు. ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రొఫెసర్ తివారీ, ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. జులై 12వ తేదీ నుంచి సొరంగం సర్వే ప్రారంభిస్తామని, వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
44 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగం మధ్యలో గాలికూడా చొరబాటుకు అవకాశం లేకుండా నిర్మాణం చేపట్టారని తెలిపారు. సొరంగంలో ఇరుక్కుపోయిన టీబీఎం తీయడానికి సాధ్యం కాదని తెలిపారు. పక్క నుంచి సొరంగం తవ్వకం చేపడతామన్నారు. సీతారామ, దేవాదుల పెండింగ్లో ఉన్న అన్ని సొరంగం ప్రాజెక్టులకు నూతన టెక్నాలజీ ఉపయోగించి పూర్తి చేస్తామని తెలిపారు.