Tatkal ticket rule : కేంద్రం కొత్త రూల్స్.. జులై 1 నుంచి ‘తత్కాల్’ కొత్త రూల్స్

‘Tatkal’ from July 1 : కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్/యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వేశాఖ తన సర్క్యులర్లో పేర్కొంది.
ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి..
జులై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని తన సర్క్యులర్లో పేర్కొంది. దీంతోపాటు అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఏసీ బోగీలకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ బోగీలకు 11.30 తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించనున్నారు. ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
24 గంటల ముందే వెల్లడి..
రైలు బయలు దేరడానికి కంటే నాలుగు గంటల ముందు మాత్రమే ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ల స్టేటస్ తెలుస్తోంది. 24 గంటల ముందే వివరాలు వెల్లడించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బికనేర్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టినట్లు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. వెయిటింగ్ జాబితా టికెట్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రయోగాత్మకంగా దీనిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.