Kashmir to Katra : కశ్మీర్ అనుసంధాన్ని చూసి నా హృదయం ఉప్పొంగి పోయింది : ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah travels in Vande Bharat train : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్-కట్ఢా మార్గంలో ఇటీవల వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా, మంగళవారం ట్రైన్లో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే నెట్వర్క్తో కశ్మీర్ మొత్తం అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు. జులైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నదని, భక్తులు ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. వైష్ణోదేవీ ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంజినీర్లు, కార్మికులను అభినందనలు..
దేశ రైల్వే నెట్వర్క్తో ఎట్టకేలకు కశ్మీర్ అనుసంధానం కావడం చూసి తన హృదయం ఉప్పొంగి పోయిందని ఆనందం వ్యక్తం చేశారు. తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు. దీన్ని సాకారం చేసిన ఇంజినీర్లు, కార్మికులను అభినందించారు. జమ్మూకశ్మీర్ నుంచి కట్ఢా వరకు రైలు ప్రయాణం మంచి అనుభూతి కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. అంజీ వంతెనతోపాటు సొరంగాల గుండా ప్రయాణం నిజంగా అద్భుతంగా ఉందన్నారు. ఇది చిరకాలం నిలిచిపోయే అనుభవమని కొనియాడారు.
ఇది ప్రజలు సాధించిన విజయం..
ఇది ప్రజలు సాధించిన విజయమన్నారు. రైలు సర్వీసులతో ప్రయాణం మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు. స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం పెరగడంతోపాటు ఇరుప్రాంతాల మధ్య స్నేహబంధం బలోపేతం అవుతుందన్నారు. జమ్మూకశ్మీర్లోని కట్ఢా, శ్రీనగర్ పట్టణాల మధ్య వందేభారత్ రైలు సేవలను ప్రధాని మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభించారు. జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్తో కలిపే మొదటి రైలు ఇదే. ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింకు ప్రాజెక్టులో భాగంగా దీన్ని పూర్తిచేశారు.