MUDA Scam : కర్ణాటకలో ముడా కుంభకోణం.. రూ.100కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

Karnataka : మూడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని తెలిపారు. ముడా అధికారులతో సహా పలువురు బడా వ్యక్తులకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఆస్తులు ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పటివరకు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారంగా రూ.400కోట్లుగా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతరులపై 1860 నాటి భారత శిక్షాస్మృతి, 1988 నాటి అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మైసూర్లోని లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ముడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడి అయ్యంది. జీటీ దినేశ్ కుమార్ సహా మాజీ ముడా కమిషనర్ల పాత్ర అనర్హమైన సంస్థలు, వ్యక్తులకు పరిహారంగా స్థలాలు కేటాయించడంలో కీలకపాత్ర పోషించినట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరించినట్లుగా సమాచారం.
కేసు నేపథ్యం..
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (మూడా)కు చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో కుంభకోణానికి సంబంధించింది. వాస్తవానికి సీఎం సిద్ధరామయ్యం భార్య పార్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలో 3.2 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు. భూమిని ముడా సేకరించింది. భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి డిమాండ్ చేసింది. దీంతో ఆమెకు ముడా దక్షిణ మైసూర్లోని విజయానగర్లో 14 ప్లాట్లను కేటాయించింది. ప్లాట్ల ధర సిద్ధరామయ్య భార్య ఇచ్చిన ల్యాండ్ ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కేటాయించారని మండిపడుతున్నాయి. భూ కుంభకోణం విలువ రూ.3వేలకోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.