Massive Fire : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి దూకి ముగ్గురు మృతి
Fire accident in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ద్వారకా సెక్టార్-13లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం 9:58 గంటల సమయంలో ఘటన జరిగింది. అపార్ట్మెంట్లోని 8,9 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు.
మొదట పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ నుంచి కిందికి దూకేశారు. పిల్లల తండ్రి (35) యష్ యాదవ్ కూడా కిందికి దూకాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పలువురు నివాసితులు మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని 8 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.