CM Revanth Meets Tony Blair: బ్రిటన్ మాజీ ప్రధానితో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ!
CM Revanth Reddy Meets former British Prime Minister: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటసేపు సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమ వివరాలను సీఎం టోనీ బ్లెయిర్కి అందజేశారు. రైతులు, యువత, మహిళలు, వివిధ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.
కోర్ అర్బన్, పెరి-అర్బన్, గ్రామీణ మండలాలతో మైక్రోప్లానింగ్కు సంబంధించిన విషయాలను టోనీ బ్లెయిర్తో రేవంత్ పంచుకున్నారు. అభివృద్ధి ఏజెండా స్థిరత్వ సూత్రాల ద్వారానే సాధించవచ్చని టోని బ్లెయిర్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అంశాలపై బ్రిటన్ ప్రధాని ఆసక్తిని కనబర్చారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్ అమలు కోసం ప్రభుత్వం, టోని బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సీఎంవో ప్రకటించింది.
మెట్రో ఫేజ్-2కు కేంద్రం సహకరించాలి : రేవంత్రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-2 అవసరం ఎంతో ఉందని రేవంత్రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. రూ.24,269 కోట్ల ప్రాజెక్టును కేంద్రంతో కలిసి ఉమ్మడిగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.
మెట్రో ఫేజ్-2 సాకారమైతే హైదరాబాద్లో రాకపోకలు వేగంగా సాగడంతోపాటు రహదారులపై రద్దీ తగ్గుతోందన్నారు. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సీఎం కేంద్రమంత్రి ఖట్టర్కు తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్రమంత్రికి సీఎం గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.