AP Government : ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలి.. ‘ఎన్ విడియా’తో ఏపీ సర్కారు ఒప్పందం

Minister Nara Lokesh : కృతిమ మేధలో యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఏఐ కంప్యూటింగ్ సంస్థ ‘ఎన్ విడియా’తో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉన్నత విద్య అధికారులు, ఎన్ విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంతో 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతోపాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు.
గతేడాది అక్టోబర్లో మంత్రి నారా లోకేశ్ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్తో ముంబయిలో సమావేశమయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకరించాలని కోరారు. ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాలతో రాష్ర్టంలోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఆధునిక ఏఐ నైపుణ్యాలను అందించనున్నారు. ఏఐ యూనివర్సిటీకి అత్యాధినికి కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు, హార్డ్వేర్ సామర్థ్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఒప్పందం వేదికగా మారనుంది. విద్యార్థులకు ప్రాజెక్టులు, పరిశోధన, మార్కెట్ అవకాశాలు, మెంటార్షిప్ వంటి అనేక అవకాశాలను కల్పించనున్నారు. ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఒప్పందం కీలకమైన ముందడుగు కానుంది.