TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఇక నుంచి చైనీస్ ఫుడ్ నిషేధం

Tirumala: కఠియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు కొలువైన తిరుమలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ స్వామి దర్శనానికి వస్తుంటారు. స్వామిని క్షణకాలమైనా దర్శించుకుని ఆనంద పడుతుంటారు. తమ కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. వసతి, భోజన, దర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది.
సామాన్యంగా తిరుమల కొండపై మద్యం, మాంసాహారం నిషేధం. అయితే కొన్ని రెస్టారెంట్లలో చైనీస్ వంటకాలైన మంచూరియా, ఫ్రైడ్ రైస్ ను అమ్ముతున్నారు. తాజాగా ఈ ఆహారపదార్థాల విక్రయాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. ఆయా వంటకాల నిషేధంతో తిరుమల పవిత్రత పెరుగుతుందని భావించింది. అలాగే హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచించింది. హోటల్ సిబ్బంది కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలని తెలిపింది. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ మేరకు హోటల్ సిబ్బంది ఎలా ఉండాలి, తీసుకోవల్సిన జాగ్రత్తలపై హోటళ్ల నిర్వాహకులు, స్థానికులతో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు పలు సమస్యలను అదనపు ఈవో దృష్టికి తీసుకెళ్లగా.. ఈవోతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. హోటళ్ల నిర్వాహకులు చేసే పొరబాట్ల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని.. ఇక నుంచి అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల యాత్రను ఓ అందమైన జ్ఞాపకంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచూరియా, ఫ్రైడ్ రైస్, చైనీస్ వంటకాలను ఇక నుంచి తిరుమల కొండపై విక్రయించకూడదని, నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని సూచించారు.