Pawan Kalyan in Chennai: వన్ నేషన్- వన్ ఎలక్షన్ వల్ల లాభమే.. చెన్నైలో పవన్ కల్యాణ్

Pawan Kalyan attends 1 Nation 1 Election seminar in Chennai: దేశంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానం వల్ల లాభమే జరుగుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలోని తిరువాన్మియూర్ లో జరిగిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనే సెమినార్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సెమినార్ లో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు అని.. తమిళనాడు సిద్ధుల భూమి అన్నారు. తమిళ దేవుడు మురుగన్ భూమి.. తాను తమిళనాడులో నివసించానని, చెన్నైలో పెరిగినట్టు గుర్తుచేశారు. తాను తమిళనాడు వదిలి వెళ్లినా.. తమిళనాడు మాత్రం తనను వదులుకోలేదని చెప్పారు.
కాగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించిడం వల్ల భారీగా ఖర్చులు అవుతాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల కారణంగా అధికారులు, భద్రత, ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తుందన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వల్ల దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగి సమయం, వ్యయం కలిసి వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తగిన సమయం దొరుకుతుందని చెప్పారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇది మంచిదికాదని పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. ‘అత్తగారు పగలగొడితే అది మట్టి కొండ.. కోడలు పగలగొడితే బంగారు కుండ అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే, వారు ఈవీఎంలకు మద్దతుగా మాట్లాడుతారు. ప్రతిపక్షపార్టీలు ఓడిపోతే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని గగ్గోలు పెడతారని’ పవన్ మండిపడ్డారు.