Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’పై మీటింగ్.. కీలక విషయాలు వెల్లడి

Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు.
పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో సమావేశం ప్రారంభించారు. పార్లమెంట్ దాడి నుంచి పహల్గామ్ వరకు ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో 350 మంది పౌరులు మృతి చెందారని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు వెల్లడించారు. పహల్గామ్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఇందులో 25మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ చనిపోయారు. అందుకే పాక్ సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని వెల్లడించారు.
భారత్ తన అధికారాన్ని ఉపయోగించిందని, పహల్గామ్ దాడులను యావత్ దేశం నిరసించిందన్నారు. ఈ దాడి తర్వాత కూడా పాక్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని, భారత్పై ఇకపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ముంబై దాడుల తర్వాత పహల్గామ్ దాడి అతి పెద్దదని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వెల్లడించారు. పహల్గామ్ దాడి అత్యంత హేయమైందన్నారు. కశ్మీర్లోె శాంతిని భగ్నం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కశ్మీర్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసుందుకే ఈ దాడి జరిగిందని చెప్పారు. ప్రధానంగా కశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని వివరించారు.
పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత పౌరులు విఫలమ చేస్తున్నారన్నారు. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తయిబాకు ఒక ముసుగు అని, ఉగ్రవాదులకు రక్షణగా టీఆర్ఎఫ్ ఉంటుందన్నారు. టీఆర్ఎఫ్పై నిషేధం తొలగించాలని పాక్ ఒత్తిడి చేసిందని వెల్లడించారు. టీఆర్ఎఫ్, లష్కరే తయిబా ఒక్కటేనని,, వాళ్ల కుట్రలను నిఘా వర్గాలు సేకరించాయన్నారు.
ఉగ్రవాదానికి స్వర్గధామంగా పాక్ మారిందని, అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైందని వివరించారు. కుట్రదారులు, దాని వెనుక ఉన్న వారిని ఆధారాలతో సహా కనుగొన్నామని వెల్లడించారు. అలాగే వాటికి ఆర్థిక సహాయం అందిస్తున్న వారిని సైతం గుర్తించామని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షిస్తామన్నారు.
పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చెప్పినట్లు కర్నల్ సోఫియా ఖురేషి వివరించారు.గత 30 ఏళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదులకు రక్షణ కల్పించడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా వారికి శిక్షణ కూడా ఇస్తోందని వెల్లడించారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలిపారు. మొత్తం 21 ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ దాడుల్లో పాక్ పౌరులకు ఎలాంటి హాని కలగలేదని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- India Hits Pakistan Terrorist Camps: పాక్పై ప్రతీకారం.. భారత్ మెరుపు దాడిలో ధ్వంసమైన ఉగ్రవాదుల స్థావరాలు ఇవే!