Published On:

Operation Sindoor: పాకిస్థాన్ స్థావరాలపై భారత్ మెరుపు దాడి.. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతం!

Operation Sindoor: పాకిస్థాన్ స్థావరాలపై భారత్ మెరుపు దాడి.. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతం!

India Operation Sindoor, attack Jaish headquarters, Lashkar Camps in Pakistan: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి 1.44 నిమిషాలకు భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవి బలగాలు సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం

 

బహవల్ పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ హెడ్ క్వార్టర్, జైషీ మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆర్మీ దాడి చేసింది. దీంతో అక్కడ ఉంటున్న 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అలాగే మురిడ్కే క్యాంపుపై కూడా దాడి చేసింది. ఈ దాడుల్లో 80 మందికిపైగా టెర్రరిస్టులు హతమైనట్లు అంచనా వేస్తున్నారు. మొత్తం 100మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందగా.. బవహల్ పూర్, మురిడ్కే క్యాంపుల్లోనే ఎక్కువమంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో క్యాంపులో సుమారు 30 నుంచి 35 మందికిపైగా ఉన్నట్లు సమాచారం.

 

కాగా, ఇండియన్ ఆర్మీ మిస్సైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అదేవిధంగా పాక్ ఆర్మీపై ఎలాంటి దాడి చేయలేదని వివరించింది. ఈ దాడుల తర్వాత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈ మెరుపుదాడులపై అర్ధరాత్రి 1.28 నిమిషాలకు ఆర్మీ ట్వీట్ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సిద్ధమని పేర్కొంది. సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.

 

ఉగ్రవాదంపై భారత్ అత్యంత సాహసోపేతమైన చర్య చేసింది. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. 2019లో బాలాకోట్‌లో దాడి తర్వాత అతిపెద్ద సైనిక చర్య చేపట్టింది. ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఆపరేషన్ సింధూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. మొత్తం పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్స్ ఫోర్స్ దాడి చేసింది. కాగా, ఈ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికాతో పాటు రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు.