Published On:

Solapur: సోలాపూర్ లో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

Solapur: సోలాపూర్ లో అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

Fire Accident: మహారాష్ట్రలోని సోలాపూర్ లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కల్ కోట్ రోడ్డులోని ఎంఐడీసీ సెంట్రల్ టెక్స్ టైల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడినట్టు సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాకేష్ సలుంఖే తెలిపారు.

 

ఇవాళ తెల్లవారుజామున 3.30 నుంచి 4.45 గంటల మధ్యలో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల ఫిర్యాదు అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 10-12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కబాడే సహా మున్సిపల్, పోలీస్ అధికారులు పరిశీలించారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు మాత్రం తెలియలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగిందా అని అనుమానిస్తున్నట్టు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శక్తిసాగర్ ధోలే వెల్లడించారు. మృతులను ఉస్మాన్ భాయ్ మన్సూరి, అనాస్ మన్సూరి, షిఫా మన్సూరి, యూసఫ్ మన్సూరిగా గుర్తించారు. అయితే మృతుల వివరాలు పరిశీలిస్తే వీరంతా ఒకే కుటుంబంగా భావిస్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయకపోవడంతోనే తమవారు చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.

 

మరోవైపు హైదరాబాద్ లోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. మీర్ చౌక్ గుల్జార్ హౌస్ భవనంలోని ఓ ఇంట్లో ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఘటనలో ఇప్పటివరకు 10 మందికిపైగా చనిపోగా పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నాతాధికారులు పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.