Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి

Air india : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది : ఏపీ సీఎం చంద్రబాబు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్రెడ్డి
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురవడంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు కేంద్రం సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి : పవన్ కల్యాణ్
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని, బాధిత కుటుంబాలకు అందరూ అండగా ఉండాలని కోరారు. ఆందోళనకరమైన సమయంలో అందరి మద్దతు వారికి బలం చేకూరుస్తుందని ఆశిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది : మంత్రి నారా లోకేశ్
విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సహాయ చర్యలు వేగంగా జరగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.