Fire Accident in Vizag Steel: విశాఖ స్టీలులో అగ్ని ప్రమాదం.. రూ.కోట్లల్లో నష్టం

Fire Accident in Vizag Steel Plant in AP: విశాఖ స్టీలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 300 టన్నుల ద్రవ ఉక్కు కాలిబూడిదైంది. దీని విలువ రూ.కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని స్టీలు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగగా.. బ్లాస్ట్ ఫర్నెస్ 2లో స్టోర్ చేసిన దాదాపు 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైనట్లు తెలుస్తోంది.
కాగా, బ్లాస్ట్ ఫర్నెస్ 2లో టర్బో ల్యాడిల్ కార్లోకి ద్రవ ఉక్కు నింపారు. దీనికి ఎస్ఎంఎస్ వద్దకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఒక్కసారిగా టీఎల్సీ వద్ద హోల్ పడింది. దీంతో అందులో నింపిన ద్రవ ఉక్కు కిందపడడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కేబుల్స్, ట్రాక్ కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పారు. ప్రస్తుతం ట్రాక్ మీద ఉన్న ఉక్కు, ల్యాడర్ కార్ను తొలగిస్తున్నారు. అయితే దీనికిపై ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. నాణ్యత కొరవడంతోనే టీఎల్సీ హోల్ పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.