Maharashtra Encounter: మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి

4 Maoist Killed in Maharashtra Encounter: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోలు చనిపోయారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. తాజాగా దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. అలాగే ఇవాళ ఉదయం ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ మావోయిస్టు చనిపోయారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. అనంతరం ఘటనాస్థలి నుంచి ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు 303 రైఫిల్స్, ఒక భార్మర్, వాకీటాకీలు, క్యాంపింగ్ మెటీరియల్ వంటి వాటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా ఇటీవల ప్రారంభమైన ఎఫ్వోబీ కవండే సమీపంలోని మహారాష్ట్ర- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో మావోయిస్టు సమూహాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. అడిషనల్ ఎస్పీ రమేష్, 300 మంది కమాండోలు, సీఆర్పీఎఫ్ నేతృత్వంలో నిన్న మధ్యాహ్నం నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం పోలీసులసు ఎదురుపడిన మావోలు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు.