Fire Accident: పంజాబ్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
Punjab: పంజాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమైనట్టు సమాచారం. శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలోని సింఘవాలి- కోట్లీ రహదారిపై ఉన్న రెండస్తుల బిల్డింగ్ లో బాణసంచా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్ లో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనలో ఐదుగురు వలస కార్మికులు సజీవ దహనమయ్యారు.
కాగా పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మరో 25 మందికి తీవ్ర గాయాలైనట్టు లంబి డిప్యూటీ ఎస్పీ జస్పాల్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలిలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.