Devendra Fadnavis: రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. సీఎం ఫడ్నవీస్ కౌంటర్

Maharastra: కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచి కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందనే ఆరోపణలపై ఆయన స్పందించారు. మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపి) శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠాక్రే పార్టీలు ఘోరంగా ఓడిపోయాయని అన్నారు. ప్రజలు వారిని తిరస్కరించారని.. అందుకే ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారని అన్నారు. ఓటమిని ఒప్పుకోవాలి కానీ.. ఇప్పుడు ఈవీఎంలను తప్పుబడుతూ ప్రజస్వామ్య విలువలను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ నిందలు వేయడం వారికి అలవాటైందని చురకలు అంటించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరిగా ఉన్నాయా? అని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో వారు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా అన్నారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు మాని.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేయాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజల్లో ఈ మాత్రం స్థానం కూడా ఉండదన్నారు. కాగా 2024 నవంబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది.