Covid- 19 in Kerala: కేరళలో విజృంభిస్తున్న కరోనా.. భారీగా కేసులు నమోదు!

Covid -19 Cases increasing in Kerala and Maharashtra: కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రెండేళ్లుగా దీని ప్రభావం తగ్గినా.. తాజాగా మళ్లీ తన పంజా విసురోసుంది. ముఖ్యంగా కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు యాక్టివ్ కేసులు పెరుగడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్క మే నెలలోనే ఇప్పటివరకు 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళంలో 34, తిరువనంతతపురంలో 30 కేసులు బయటపడ్డాయి. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అలాగే జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని కోరారు.
మరోవైపు మహారాష్ట్రలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 106 కేసులు నమోదయ్యాయి. వీటిలో 101 కేసులు ముంబైలో వెలుగు చూడగా మిగిలినవి పుణె, థానే, కొల్హాపూర్ వారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.