Published On:

Operation Sindoor: పాక్ కు బుద్ధిచెప్పేందుకు రెడీగా ఉన్నాం: భారత్ త్రివిధ దళాలు

Operation Sindoor: పాక్ కు బుద్ధిచెప్పేందుకు రెడీగా ఉన్నాం: భారత్ త్రివిధ దళాలు

India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసిందని, అలాగే సరిహద్దు వెంబడి కాల్పులు జరిపిందని తెలిపారు. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొందని చెప్పారు.

 

మరోవైపు భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ లోని పలు ఆర్మీ బేస్ క్యాంపులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. సుమారు 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారన్నారు. అయితే భారత్ దాడులకు తట్టుకోలేక పాకిస్తాన్ కాల్పుల విరమణను తీసుకువచ్చిందని చెప్పారు. అందుకు భారత్ ఒప్పుకున్నా.. నిన్న సాయంత్రం తిరిగి దాడులు చేసిందని తెలిపారు. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు.

 

పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్తాన్ మళ్లీ దాడులు ప్రారంభిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అధికారులు తెలిపారు. కాగా రేపు ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయని చెప్పారు. ఆ తర్వాతే తుది నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.

 

భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థతో పాకిస్తాన్ కు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూపించామన్నారు. సైన్యం, వాయుసేన చర్యలకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సిద్ధంగా ఉందని చెప్పారు. భారత్ జరిపిన దాడులతో పాకిస్తాన్ ఇప్పటికే వణికిపోతుందన్నారు.