Published On:

CM Chandrababu: ఉద్యోగుల తరహాలోనే పేదలకు ఒకటో తేదీన పెన్షన్లు.. ప్రజావేదిక సభలో చంద్రబాబు

CM Chandrababu: ఉద్యోగుల తరహాలోనే పేదలకు ఒకటో తేదీన పెన్షన్లు.. ప్రజావేదిక సభలో చంద్రబాబు

CM Chandrababu Speech in Ambedkar Konaseema district: రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో పర్యటించారు. ఇందులో భాగంగా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో లబ్ధిదారులకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. రేపు ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడారు.

 

రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని చంద్రబాబు చెప్పారు. ఒకరోజు ముందే పేదల సేవలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మాది పేదల కోసం పని చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కొంతమందికి పనిచేసే చోటే పెన్షన్లు అందిస్తున్నామన్నారు.

 

ఉద్యోగుల తరహాలోనే పేదలకు ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. పెన్షన్లు పెంచుతామని చెప్పామని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. ఏడాదిలో పెన్షన్ల కోసం రూ.34వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీదేనన్నారు.

 

దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంతలా పెన్షన్లు ఇవ్వడం లేదని చెప్పారు. అలాగే మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ఆదాయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల కంటే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.