Air india Flight Crash : విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Ahmedabad : గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సహాయక చర్యల వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. అహ్మదాబాద్ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని రామ్మోహన్ నాయుడు, అమిత్ షాకు ప్రధాని మోదీ సూచించారు.
హృదయవిదారకం : బ్రిటన్ ప్రధాని
లండన్ గాట్విక్కు బయలు దేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.
రంగంలోకి ‘ఏఏఐబీ’
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) రంగంలోకి దిగింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి బయలు దేరారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టనున్నారు.
ఎయిరిండియా విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
విమాన ప్రమాదం నేపథ్యంలో విమానయాన మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 011-24610843, 9650391859 నంబర్లను సంప్రదించి ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని పేర్కొంది. ఎయిర్ ఇండియా హాట్లైన్ నంబర్ 1800 5691 444ను ఏర్పాటు చేసింది.