Last Updated:

YS Sharmila: బండిసంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేసిన వైఎస్ షర్మిల..

తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పయనిస్తున్నాయి. నిరుద్యోగుల అంశం వేదికగా వైఎస్సార్టీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చొరవ తీసుకున్నారు.

YS Sharmila: బండిసంజయ్, రేవంత్ రెడ్డిలకు  ఫోన్ చేసిన వైఎస్ షర్మిల..

YS Sharmila: తెలంగాణలో ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పయనిస్తున్నాయి. నిరుద్యోగుల అంశం వేదికగా వైఎస్సార్టీపీ, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చొరవ తీసుకున్నారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని వైఎస్ షర్మిల స్వయంగా ప్రతిపాదించారు.

ప్రతిపక్షాలను కేసీఆర్ బ్రతకనివ్వరు..(YS Sharmila)

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ చేసి మాట్లాడారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దామని షర్మిల మిగిలిన రెండు పార్టీల అధ్యక్షులకి చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని వైఎస్ షర్మిల సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని షర్మిల అన్నారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వరని షర్మిల చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పారు.

ప్రశ్నపత్రాల లీకేజీపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పేపర్ లీకేజీ ఘటనపై.. విద్యార్ధులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వ పెద్దలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.పేపర్ లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు. ఇందులో పెద్ద వ్యక్తులను తప్పించి.. చిన్నవాళ్లను దోషులుగా చిత్రకరించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.అభ్యర్ధుల తరపున.. కమిషన్ ఎదుట ఆందోళన చేస్తామంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.బయటకు వెళ్లాలన్నా..ఇతర కారణాలు చెప్పి తనను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.తన ఇంటి వద్ద పోలీసులను మోహరించి.. ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారు.. లుక్‌ అవుట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నేనేమైనా క్రిమినల్‌నా? అని షర్మిల ప్రశ్నించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ వేగంగా దర్యాప్తు చేస్తోంది.ఇక తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్.. ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ – డీఏవో, ఏఈ జనరల్ స్టడీస్ వంటి పరీక్షలతో పాటు.. జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌ డ్రైవ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని నిందితులుగా చేర్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు లక్షల్లో నగదు మార్పిడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా రాజాసింగ్ స్పీచ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అప్ఝల్ గంజ్ పీఎస్‌లో ఎస్ఐ వీరబాబు ఫిర్యాదు చేశారు. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.