Telangana: సర్కార్ కీలక ప్రకటన.. మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్

Telangana Government 25 more s slot booking system introduced from may 12: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అయితే మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ చివరి నాటికి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా, గత నెల 10వ తేదీ నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానంతో 30 వ తేదీ వరకు సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఈ విధానం తీసుకురావడంతో ప్రజలకు సమయం ఆదా చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిందని వివరించారు.
ఇందులో భాగంగానే 2వ దశలో ఫరూక్ నగర్, షాద్నగర్, మహేశ్వరం, వనస్ధలిపురం, షేర్ లింగంపల్లి, ఉప్పల్, ఘట్కేసర్, నారప్పల్లి, మల్కాజ్గిరి, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, బీబీనగర్, సిద్దిపేట అర్భన్ & రూరల్, మంచిర్యాల..పెద్దపల్లి, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల్, గజ్వేల్, రంగారెడ్డి, వరంగల్ హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రార్ ఆఫీస్లలో అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే అమలవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్ కార్డుల ద్వారా మంత్రి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో దాదాపు 94 శాతం మంది హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. కాగా, ఈ విధానంలోరిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందులోనే ఆధార్ -ఈ సంతకం ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరితగతిన అమలులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.