YS Sharmila : వివేకా హత్య కేసు సాక్షులను బెదిరిస్తున్నారు.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila : వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.
గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకా కుమార్తె సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆమె ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏదైనా చేస్తారనే భయం ఉందని చెప్పారు. ఇటీవల తనకు తెలిసిన విషయాలు ఆలోచింపజేస్తున్నాయని తెలిపారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై ప్రభుత్వ అఫిడవిట్లో పలు అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
విచారణ అధికారులను అవినాష్ పిలిపించుకొని బెదిరించారని అఫిడవిట్లో ఉందని చెప్పారు. తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాష్రెడ్డి సంతకాలు చేయించినట్లుగా ఉందని పేర్కొన్నారు. అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదన్నారు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయలేదని, వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్రెడ్డి అని షర్మిల అన్నారు.