Published On:

YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మొహరింపు

YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. భారీగా పోలీసుల మొహరింపు

AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే2న ఏపీకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. గతంలో 2015లో ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు తాను అక్కడికి వెళ్తున్నట్టు వెల్లడించారు.

 

అయితే ఉద్దండరాయుని పాలెంలో షర్మిల పర్యటించేందుకు అనుమతిలేదని పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా బలగాలను మొహరించారు. దీంతో పోలీసులు, ప్రభుత్వం తీరుపై వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లడం నేరమా? అని ప్రశ్నించారు.

 

ఏపీ రాజధాని ప్రాంతాన్ని చూడటం తప్పా? జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకోవడం నేరమా? అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అమరావతి క్యాపిటల్ కమిటీ వేశామని, కమిటీ అక్కడ పర్యటించాలని నిర్ణయించుకుందన్నారు. తమను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిలదీశారు. అమరావతి రాజధాని పనుల ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీని అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. తన ఇంటి ముందు ఇంత సెక్యూరిటీ ఎందుకు? తాను ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయలేదు కదా అని షర్మిల అన్నారు.

 

రాజధానికి అన్యాయం చేసిందెవరు? మేము కమిటీ వేసుకుంటేనే మీకు భయం అవుతంది. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? తనపై పోలీసులు చేయి వేశారు. ఇదేనా మహిళలతో వ్యవహరించే తీరు. ధర్నాలు, నిరసనలు చేసే హక్కు నాకు లేదా? మీరు నియంతలు కాదు గుర్తు పెట్టుకోండి. మహిళలపై అఘాయిత్యాల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అని వైఎస్ షర్మిల అన్నారు.