KTR : కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం.. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ నుంచి పిలుపు

BRS Working President KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు.
ఫోరమ్ ఈ నెల 20,21 తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. ‘భారత అభివృద్ధికి ఫ్రంటీయర్ టెక్నాలజీస్’ అనే అంశంపై ఈ సంవత్సరం ఫోరమ్ దృష్టిసారించింది. భారత్లో సాంకేతికత, ఇన్నోవేషన్, సస్టైనబిలటీని కలగలిపి ముందుకెళ్లే అంశాలపై చర్చ జరగనుంది. తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్కు ఫోరమ్ వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ సిద్ధార్థ్ సెథీ ఆహ్వాన లేఖ పంపించారు. భారతదేశ అభివృద్ధికి మీరు చూపించిన మార్గదర్శకత, టెక్నాలజీ ఆధారిత పాలన, పెట్టుబడుల వృద్ధికి తీసుకున్న చర్యలు అంతర్జాతీయ వేదికపై యువతకు ప్రేరణ కలిగిస్తాయని లేఖలో పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్లో ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపర్చడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.