TS Govt Schools : ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ.. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీచేశారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాస్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కేవలం ప్రైవేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైంది. ప్రైవేట్ స్కూళ్లు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను నడుపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే పిల్లలకు చదువుకునే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు తెలంగాణలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలకు మూడేళ్లు నిండగానే ప్రీ ప్రైమరీ కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని సర్కారు భావించింది. ఈ సందర్భంగానే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి.