Last Updated:

Telangana Martyrs Memorial: అమరల యాధిలో స్మారక చిహ్నం.. హుస్సేన్ సాగరతీర దీదీప్యమానమై వెలుగనున్న అమరదీపం

Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.

Telangana Martyrs Memorial: అమరల యాధిలో స్మారక చిహ్నం.. హుస్సేన్ సాగరతీర దీదీప్యమానమై వెలుగనున్న అమరదీపం

Telangana Martyrs Memorial: తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఇటీవలే యావత్ దేశం గర్వించేలా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల ఎత్తైన భారీ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూల విస్తరించేలా చేశారు సీఎం కేసీఆర్. కాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ సమాజం గర్వించేలా మరో నూతన నిర్మాణం ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం యాధికి వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ‘అమరవీరుల దీపం’ నేటి నుంచి హుస్సేన్ సాగర్ తీరాన ప్రతి రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది.

అమరుల స్మారక భవన నిర్మాణ వివరాలు:
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా ఆరు అంతస్తుల్లో కేసీఆర్ ప్రభుత్వం అమరవీరుల స్మారక భవనాన్ని రూపొందించింది. హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించింది. 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీపం ఆకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. 54, 37 అక్షాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ప్రమిదను రూపొందించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు, మరో వైపు 18 మీటర్ల ఎత్తుతో, మొత్తంగా గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. స్మారక భవనం నిర్మాణానికి మొత్తంగా 1,600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్ వినియోగించినట్టు సమాచారం.

స్మారక చిహ్నం పూర్తి వివరాలు:
బేస్ మెంట్-1: ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. దీనిలో 160 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంది.

బేస్ మెంట్-2: ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితమైంది. 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యంతో పాటు లాంజ్ ఏరియా, లిఫ్ట్ లాబీ, భూగర్భంలో 3 లక్షల లీటర్ల నీటి సామర్థ్యమున్న సంపులను దీనిలో ఏర్పాటు చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 28,707 చదరపు అడుగులు. ఇందులో మెయింటనెన్స్, సివిల్, ఎలక్ట్రికల్ కార్యకలాపాలు జరుగుతాయి.

మొదటి అంతస్తు: దీని విస్తీర్ణం 10,656 చదరపు అడుగులు. ఇందులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో, విజువల్ రూమ్ ఉంటుంది.

రెండవ అంతస్తు: దీని విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు. కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియాలను కలిగి ఉంటుంది.

మూడవ అంతస్తు (టెర్రస్): దీని విస్తీర్ణం 8,095 చదరపు అడుగులు. కూర్చునే ప్రదేశం, ప్యాంట్రీ ఏరియాతో కూడిన రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ ఇందులో ఉన్నాయి.

మెజ్జనైన్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 5,900 చదరపు అడుగులు. గ్లాస్ రూఫ్ తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంకును కలిగి ఉంది

అమర దీపం: తక్కువ కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్ తో తయారైన 26 మీటర్ల జ్వాల. ఇది గోల్డెన్ ఎల్లో కలర్ లో ప్రకాశిస్తూ ఉంటుంది.

ఇకపోతే నేడు ఈ అమరదీపం ఆవిష్కరణ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌ రోడ్డు, రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్‌ మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. ఇవాళ ఎన్టీఆర్‌ గార్డెన్, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీపార్క్‌ లను సైతం మూసివేయనున్నారు.