MLC Mahesh Kumar Goud: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం

TPCC Chief Comments On Congress: టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా నిర్వహించిన మంత్రివర్గ విస్తరణ అని తెలిపారు. గాంధీభవన్ లో మాట్లాడుతూ.. రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని పదవులు ఇవ్వాలని డిమాండ్ ఉందన్నారు. వారికి న్యాయం చేసే దిశగా ఏఐసీసీ ఆలోచనలు చేస్తోందని పేర్కొన్నారు. కేబినెట్ లో ఇంకా మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందన్నారు. ప్రజాపాలనలో రాష్ట్రం సంక్షేమంలో దూసుకెళ్తోందన్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాలుగు నెలల క్రితమే ఎన్నికలు జరగాల్సిందని.. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని అనుకోవడం వల్ల ఆలస్యమైందన్నారు. ఎస్సీ, బీసీ వర్గీకరణ చేసి కేంద్రానికి పంపించామని.. ఫైల్ అక్కడ పెండింగ్ లో ఉందన్నారు. ఈ విషయంలో ఒక్క బీజేపీ నేత నోరు మెదపడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీఆర్ఎస్ గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 18 నవెలల్లోనే చేసిందన్నారు.