Bhu Bharati : రేపే భూ భారతి ప్రారంభోత్సవం.. పైలెట్ ప్రాజెక్ట్గా మూడు మండలాలు

Bhu Bharati : ఎన్నికల్లో ధరణి పోర్టర్ను బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ధరణితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను దోచుకుని అమ్ముకుందని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూ భారతిని అమలు చేస్తామని చెప్పింది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ భారతిని ప్రవేశపెట్టింది. తెలంగాణలో రేపే భూ భారతి పోర్టర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
సీఎం రేవంత్రెడ్డి సమీక్ష..
భూ భారతిని రేపు (సోమవారం) ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారం కోసం సమాచారం రైతులు, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభించిన తర్వాత తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
సులభమైన భాషలో పోర్టల్..
ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూ భారతి పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు.