Miss World 2025 : తెలంగాణ సచివాలయంలో ప్రపంచ సుందరీమణుల సందడి

Miss World 2025 Contestants Visit Telangana Secretariat : ప్రపంచ సుందరీమణులు ఆదివారం తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా అద్భుతమైన సచివాలయాన్ని చూసి ఆశ్చర్య వ్యక్తం చేశారు. కంటెస్టెంట్లు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.
మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజం అభివృద్ధి : మంత్రి జూపల్లి
సచివాలయంలో ప్రపంచ అందాల భామలకు ఏర్పాట్లు చేసిన హైటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సచివాలయ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ప్రపంచ సుందరీమణుల పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జూపల్లి అన్నారు.
రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరణ..
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నం–12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్, బడా గణేశ్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆకట్టుకున్న డ్రోన్ ప్రదర్శన..
ప్రపంచ సుందరీమణులు తెలంగాణ సచివాలయ సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. డ్రోన్ షో ద్వారా ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ , రూ.500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు.