Kaleshwaram: కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. తప్పని తిప్పలు

Saraswati Puskaralu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరానికి పోటెత్తారు.
దీంతో కాళేశ్వరం వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహాదేవ్ పూర్ నుంచి కాళేశ్వరానికి వెళ్లే 18 అటవీ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వాహనాలు 18 కిలోమీటర్లు ప్రయాణానికి 4 గంటల సమయం పట్టింది.
మరోవైపు ఎండలకు తాళలేక, వాహనాల్లో ఉండలేక రోడ్డు పక్కనే చెట్ల కింద సేదతీరారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో అల్లాడిపోయారు. కొందరు వాహనాలను అడవుల్లోనే పార్క్ చేసి నడక మార్గంలో కాళేశ్వరం చేసుకున్నారు. కాగా ట్రాఫిక్ జామ్ విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసేలా చర్యలు తీసుకున్నారు.
అయితే కాళేశ్వరం వస్తున్న వాహనాలకు ట్యాక్స్ వసూలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు సమాచారం. ఒక్కో వాహనానికి రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లించిన వాహనాలకు మాత్రమే పార్కింగ్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. డబ్బులు తీసుకుని బిల్లు ఇచ్చేందుకు సమయం పడుతుండటంతో వాహనాలు బారులు తీరాయి. దీంతో కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించి ట్యాక్స్ వసూలును రద్దు చేసినట్టు గా ప్రకటించారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని చెప్పారు.