Jyoti Malhotra: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రా!?

ఇదే క్రమంలో జ్యోతి మల్హోత్రా అనే అందాల సుందరి.. తనదైన ట్రావెల్ విత్ జో అనే యూ-ట్యూబ్ చానల్ పెట్టింది. 2011లో చానల్ పెట్టి.. ఇప్పటికి 3లక్షల 80వేల సబ్ స్క్రైబర్స్ ను సంపాదించుకోగలిగింది. ఈ క్రమంలో వచ్చిన అనుభవాన్ని ఉపయోగించుకొని.. తన చానల్ ద్వారా వ్యూయర్షిప్ పెంచుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుంటోంది. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ చానల్ మాటున ఆమె ఇప్పుడు దేశ ద్రోహానికే తలపడిందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించగానే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడీ జ్యోతి మల్హోత్రా ఎక్కడెక్కడ తిరిగిందీ.. ఎవర్ని కలిసిందీ.. ఆమె సృష్టించిన వీడియోల పర్యవసానాలు ఏంటనేది నిర్ధారించేందు ప్రాసెస్ నడుస్తోంది.
హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ కోసం ఆమె గూఢచర్యం చేసిందన్న ఆరోపణలకు బలం చేకూరడంతో పోలీసుు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె తన “ట్రావెల్ విత్ జో” యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతదేశ సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థలకు.. ముఖ్యంగా ఐఎస్ఐకి అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఆమె పాకిస్తాన్ హైకమిషన్లో ఇశాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని కలిసి, అతని ద్వారా పాకిస్తాన్ నిఘా అధికారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.

youtuber jyoti malhotra suspected pakistan spy 1
జ్యోతి 2023లో రెండుసార్లు పాకిస్తాన్కు వెళ్లి, అక్కడ అలీ అహ్వాన్, షాకిర్, రాణా షహబాజ్ వంటి నిఘా అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా సమాచారాన్ని పంపినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ పట్ల భారత్ లో సానుకూలమైన ఇమేజ్ సృష్టించేలా ఆమె వీడియో క్రియేషన్ ఉన్నట్టు అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు. ఆమె చేసిన వీడియోలు చూసినా ఇదే విషయం రూఢి అవుతుందంటున్నారు నెటిజన్లు.
ఇక ఆమె మీద వెల్లువెత్తున్న తీవ్రమైన విమర్శల్లో పాక్ లో పర్యటించడం వెనకాల భారీ రీజనే ఉందంటున్నారు. గత జనవరిలో ఆమె పహల్గామ్కు వెళ్లిన తర్వాత పాకిస్తాన్కు ప్రయాణించింది. ఆమె ఇన్స్టా లో పోస్టు చేసిన వీడియోలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుండడం విశేషం. పహల్గామ్ కు టూరిస్టులు వచ్చేలా పహల్గాం అందాలు వివరిస్తూ, అక్కడ ఫొటోలు తీసుకుంటే జీవితంలో మరపురాని అనుభూతులు నింపుకున్నట్టేనని.. ఇలా టూరిస్టులను పహల్గాంకు వెళ్లేలా చేయడానికి ఆమె వీడియోలు కారణమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
మరోవైపు ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం షరీఫ్ ను కలవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పలువురు ఐఎస్ఐ అధికారులతో ఆమె కలిసినట్టు కూడా తెలుస్తోంది. పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య అత్యంత దారుణంగా పడిపోతుంటే.. ఆమె హిందువులతో చేసిన ఇంటర్ వ్యూలలో హిందువులు చాలా సుఖంగా, ఆనందంగా ఉన్నారనే మెసేజ్ ను కావాలని ఎంచుకున్న సబ్జెక్టుగానే భావిస్తున్నారు. ఆమెను అరెస్టు చేసే సమయంలో ఆమె నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని సైబర్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఆమె నుంచి ఇంకా ఎలాంటి అంశాలు పోలీసులు సేకరిస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

pakistan jyoti malhotra
జ్యోతి మల్హోత్రా మాదిరిగానే సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ గా అవతారాలు ఎత్తి.. మన శత్రు దేశమైన పాకిస్తాన్ కు ఉప్పందిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలు యూ-ట్యూబ్ చానళ్లను, ప్రధాన స్రవంతికి చెందిన యూ-ట్యూబ్ చానళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయించింది. అలాగే ఇండియాలోని పలు యూ-ట్యూబ్ చానళ్లను కూడా నిషేధించింది. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరికొందరిని కూడా పోలీసులు విచారిస్తున్న దరిమిలా ఎలాంటి కొత్త కోణాలు వెలుగు చూస్తాయో చూడాలి.