CM Revanth Reddy : బీఆర్ఎస్కు పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ : సీఎం రేవంత్

CM Revanth Reddy : ప్రత్యేక రాష్ట్రం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బాపూజీ చనిపోతే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత టెక్స్టైల్ వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. దానికి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా బాపూజీ పేరు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అఖిల భారత పద్మశాలీ మహాసభలో సీఎం పాల్గొని మాట్లాడారు.
నేతన్నలకు ప్రాధాన్యత..
తైలంగాణలో రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామని చెప్పారు. తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నానని వెల్లడించారు. తనను గుండెల్లో పెట్టుకున్న మీ రుణం తీర్చుకుంటానని చెప్పారు. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లు రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించానని, అందుకే మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని గుర్తుచేశారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను తెలంగాణ నేతన్నలకు ఇస్తున్నామన్నారు.
రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్సే..
1939 తర్వాత కులగణన ఇప్పటివరకు మళ్లీ జరగలేదన్నారు. మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. భారత్ జోడో యాత్రలో బలహీనవర్గాల కష్టాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చూశారని, కులగణన చేసి జనాభా దామాషాలో బీసీలకు న్యాయం చేయాలన్నది రాహుల్ ఆశయమన్నారు. ఈ క్రమంలో లక్షమంది ఎన్యుమరేటర్లను నియమించి తెలంగాణలో పకడ్బందీగా కులగణన నిర్వహించామన్నారు. కులగణన నచ్చనివారు సర్వేపై దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతల భయమని సీఎం రేవంత్ అన్నారు.