CM Revanth Delhi Tour: మే 24 నీతి ఆయోగ్ మీటింగ్.. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

Telangana CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీలో ఈ నెల 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశంల రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
అలాగే తెలంగాణ తరపున ప్రత్యేక అభ్యర్థనలను సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. అలాగే రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు పూర్తిస్థాయి ఆర్థిక సాయం, హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణకు అవసరమైన కేంద్ర నిధులు, అనుమతులు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం సాయం, అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరనున్నారు. మరోవైపు రాష్ట్రంపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రుణాల రీషెడ్యూలింగ్, కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావల్సిన నిధుల విడుదలలో వేగం, రాష్ట్రాల ఆర్థిక హక్కులు, కేంద్రం నుంచి నిధుల కేటాయింపుల్లో పారదర్శకత వంటి అంశాలను సీఎం రేవంత్ ప్రస్తావించనున్నారు. కీలక ప్రాజెక్టులతోపాటు వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, విద్య, వైద్య రంగాల్లో సమస్యలను చెప్పనున్నారు.