Bhatti Vikramarka Review: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం.. రాజీవ్ యువ వికాసంపై భట్టి రివ్యూ

Bhatti Vikramarka Review with Bank Employees: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా జూన్ 2న ఐదు లక్షల మంది యువతకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని.. అందుకు బ్యాంకులు తగిన తోడ్పాటు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. రూ. 6250 కోట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. అన్ని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ చేయడానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియామకం చేసి రాజీవ్ యువ వికాస పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
మరోవైపు వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఉద్యానవన పంటలు ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున పెంచేలా చేస్తున్నామని, రూ. 21 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేశామన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అడవి బిడ్డల బతుకులు బాగుపడేలా ఇందిర గిరి జల వికాస పథకం తీసుకువచ్చామన్నారు. రూ. 12600 కోట్లతో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న 6 లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్ ద్వారా సాగులోకి తీసుకువచ్చేలా పథకాన్ని రూపొందిచామన్నారు.
రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని, స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.