Rains: హైదరాబాద్ లో వర్షం.. ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్

Telangana: హైదరాబాద్ లో వర్షం పడుతోంది. ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావల్సిన టైంలో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇక సిటీలో కోఠి, ఎంజే మార్కెట్, చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, చంపాపేట, సికింద్రాబాద్, బషీర్ బాగ్, జూబ్లీహిల్స్, బంజాహిల్స్, అమీర్ పేట, నాంపల్లి, చార్మినార్, రామాంతపూర్, అబిడ్స్, అంబర్ పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరోవైపు ఖైరతాబాద్, లక్డీకపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ ఏరియాలో మోస్తరు వర్షం కురుస్తుంది. మరికొద్ది గంటల్లో సిటీ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక తెలంగాణపై ఆవరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అలాగే వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాల రాకకు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోని ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రానున్న మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.