Bandi Sanjay on BRS: తెలంగాణలో రైల్వేలకు మహర్దశ.. బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలే!
Bandi Sanjay and Komati Reddy at Amrit Bharat Railway Stations Inauguration: తెలంగాణలో రైల్వేలకు మహర్దశ పట్టిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో గత పదేళ్లు రైల్వేలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాగా నేడు దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా రాజస్థాన్ లోని బీకనీర్ నుంచి ప్రారంభించారు. అయితే బేగంపేట, వరంగర్, కరీంనగర్ అమృత్ రైల్వేస్టేషన్ల ప్రారంభానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వేలకు మహర్దశ పట్టిందన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1300 రైల్వేస్టేషన్లను ఆధునికరించామని తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ను రూ. 27 కోట్లతో డెవలప్ చేశామని వివరించారు. త్వరలోనే అమృత్ భారత్ పథకంలో భాగంగా జమ్మికుంట రైల్వేస్టేషన్ ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరోవైపు కరీంనగర్ నుంచి తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న రైలును 4 రోజులు నడిపేలా రైల్వే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ చెప్పారు.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ప్రారంభించిన బేగంపేట రైల్వేస్టేషన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను తలపించేలా ఉందని అన్నారు. చిన్నప్పటి నుంచి చూస్తు వస్తున్న ఈ రైల్వేస్టేషన్… రీ డిజైన్ తర్వాత నమ్మలేనంతగా మారిపోయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని రైల్వేస్టేషన్లను కేంద్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు భక్తుల కొరకు ఎంఎంటీఎస్ సర్వీస్ మంజూరు చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. అలాగే నల్గొండ రైల్వే లైన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఘటకేసర్, యాదాద్రి లైన్ త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా అనుమతులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.