Remand prisoner dies : పోలీసుల విచారణలో రిమాండ్ ఖైదీ మృతి.. ఏమి జరిగిందంటే?

Remand prisoner dies : పోలీస్ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే యువకుడి మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల తమ కుమారుడు పీఎస్లోనే మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంపత్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపత్ ఆసుపత్రిలో కుప్పకూలి మృతిచెందాడు. ఇది డాక్టర్లు కూడా చూశారని చెప్పుకొచ్చారు.
రిమాండ్ ఖైదీగా ఉన్న సంపత్ మృతిపై విచారణ జరుగుతోందని, ముగ్గురు డాక్టర్ల బృందం సంపత్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారని తెలిపారు. అనుమానస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ ఉపాధి కోసం కొంతమందిని గల్ఫ్ పంపించినట్లు సమాచారం. సంపత్ అనే వ్యక్తి ద్వారా దుబాయి వెళ్లిన కొందరికి పని లేక ఇబ్బందులు పడ్డారు. తమను సంపత్ కావాలనే ఉద్దేశంతో నకిలీ వీసాలపై పంపించి మోసం చేశాడని బాధితులు నిజామాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో క్రైం పోలీసులు సంపత్తోపాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం రెండు రోజుల విచారణ నిమిత్తం సంపత్ను కస్టడీలోకి తీసుకోగా, ఈ రోజు ఉదయం సంపత్ కస్టడీలో మృతి చెందడం సంచలనంగా మారింది.