Last Updated:

Pawan Kalyan: వైసీపి మళ్లీ వస్తే అధోగతే : పవన్‌ కల్యాణ్‌

వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.

Pawan Kalyan: వైసీపి మళ్లీ వస్తే అధోగతే : పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh: వైసీపి మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన లోపాల గురించి ప్రశ్నిస్తే అసభ్యంగా తిడుతున్నారని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చివైసీపి అరాచక పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడో విడత జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ప్రజల సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ అర్జీలు స్వీకరించారు. గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల నుంచీ పలువురు వినతులిచ్చేందుకు తరలివచ్చారు. వీరితోపాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 30 మంది జనసేన బృందం ప్రజల నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్వహించింది. మొత్తం 497 అర్జీలు వచ్చాయి. ‘వారం రోజులలోగా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.

‘జనవాణిలో స్వీకరించిన అర్జీల్లో ప్రధానంగా రాష్ట్రంలో కుంటుపడిన మౌలిక సదుపాయాలు, మద్యం విక్రయాలు, ఇళ్ల పట్టాల్లో అవినీతి, టిడ్కో గృహాల్లో మోసాలు, పారిశుద్ధ్య సమస్యలు, దళితులపై దాడులు, పథకాల్లో కోతలు, ఇసుక దోపిడీ తదితర సమస్యలపై వచ్చినవే ఉన్నాయని పవన్ తెలిపారు. సంపూర్ణ మద్యనిషేధం హామీ ఇచ్చి ఆడపడుచుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రాష్ట్రంలో మద్యపానాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ వారి పసుపు కుంకుమలను చెరిపేస్తున్నారన్నారు. వైసీపి పాలనలో దాదాపు 5వేల మంది కల్తీ మద్యం తాగి మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు. వైసీపి చేస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆడపడుచులు ప్రశ్నించాలని కోరారు. లోకల్‌ బ్రాండ్ల పేరుతో ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బినామీల పేరిట కొత్త మద్యం పాలసీ ద్వారా ఏటా రూ.30వేల కోట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే మద్యం విక్రయాల్లో నగదు తీసుకుంటూ దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారులపై ప్రయాణిస్తే గర్భిణులు మార్గమధ్యలోనే ప్రసవించేలా ఉన్నాయన్నారు. రోడ్లన్నీ ఈతకొలనులను తలపిస్తున్నాయని,అందుకే వైసీపి ప్రభుత్వాన్ని మేల్కొలపాలన్న ఉద్దేశంతోనే ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం సర్‌’ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టు జనసేనాని స్పష్టం చేశారు.

రకరకాల ఇసుక విధానాలను తీసుకొచ్చి అధికార పార్టీ ఇసుకాసురులతో దందా చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. లారీ ఇసుక రూ.28వేల- రూ.36వేల వరకూ అమ్ముతూ సామాన్యులతోపాటు భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. విద్యా వ్యవస్థను కొత్త విధానం పేరుతో అయోమయంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు దగ్గర అడ్డదిడ్డంగా అప్పులు చేసి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు ఎంతో వ్యత్యాసం ఉండేలా జీవోనే తీసుకువచ్చారన్నారు. పాలసీ గురించి ప్రశ్నిస్తుంటే వైసీపి నాయకులు అసభ్య పదజాలంతో తిడుతున్నారని తెలిపారు . అన్న వస్తే అద్భుతాలు చేస్తాడన్నారు. పాలన పూర్తి కావొస్తున్నా ఆయన ఏం అద్భుతాలు చేశారో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. డిగ్రీ చదివి ఉద్యోగాలు రాని యువత సంఖ్యలో దేశంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ఊతం లేని దివ్యాంగులుంటే తూతూమంత్రంగా పింఛను ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 700 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు’ అని పవన్‌ ధ్వజమెత్తారు.

సినిమాలు ఆపడంపై పెట్టిన శ్రద్ధలో కొంతైనా నేతలు రాష్ట్ర అభివృద్ధిపై పెడితే బాగుంటుందని పవన్‌ వ్యాఖ్యానించారు. సినిమా అనగానే అన్ని స్థాయిల అధికారులను దించుతున్నారన్నారు. ‘తను ఎక్కడికీ పారిపోలేదని నేనున్నాను అన్న భరోసా ఇవ్వడానికే జనవాణి కార్యక్రమం అన్నారు. వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి నోరు నొక్కడానికి ఎస్సీ, ఎస్టీ, నాన్‌బెయిలబుల్‌ కేసులు భయపెడుతున్నారని విరుచుకుపడ్డారు. నేను ప్రజల కోసం దెబ్బలు తింటా, జైలుకు వెళతా. అవమానాలు భరిస్తా. అవినీతి, అక్రమాలను నిరోధించడానికి జనసేన పోరాడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమే’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: