Published On:

Trump warning to Apple: ‘యాపిల్‌’కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25శాతం సుంకం చెల్లించాల్సిందే!

Trump warning to Apple: ‘యాపిల్‌’కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25శాతం సుంకం చెల్లించాల్సిందే!

Donald Trump warning to Apple: ఐఫోన్ల తయారీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘యాపిల్‌’ సంస్థను మరోసారి హెచ్చరించారు. యూఎస్‌లో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని సూచించారు. భారత్‌ లేదా మరే ఇతర దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25 శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

 

సామాజిక వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్టు..

అగ్రరాజ్యంలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్‌ స్టేట్స్‌లోనే తయారు చేయాలన్నారు. భారత్‌ లేదా మరో దేశంలో కాదని టిమ్‌ కుక్‌కు ఇదివరకే తెలియజేసినట్లు చెప్పారు. అలా కుదరదంటే కనీసం 25 శాతం సుంకాన్ని యూఎస్‌కు యాపిల్‌ చెల్లించాల్సిందేనని ట్రంప్‌ సొంత సామాజిక వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. వెంటనే యాపిల్‌ షేరు విలువ 3 శాతం పతనం అయినట్లు తెలుస్తోంది.

 

చైనాపై అమెరికా సుంకాల ప్రభావం..

చైనాపై అగ్రరాజ్యం అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని ఇండియాలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్‌ ఇప్పటికే వెల్లడించింది. విస్తరణ ప్రక్రియపై ఇటీవల ట్రంప్ స్పందించారు. దాన్ని నిలిపివేయాలని యాపిల్‌కు సూచించారు. ఇండియాలో యాపిల్‌ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని, అది తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఖతార్‌ పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మళ్లీ స్పందించారు. అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక తప్పదంటూ యాపిల్‌ను హెచ్చరించడం గమనార్హం.

 

ఈయూ దేశాలపై 50 శాతం సుంకం..

ఈయూ దేశాలపై డొనాల్డ్ ట్రంప్‌ సుంకాల కొరడా ఝళిపించారు. ఆయా దేశాలపై 50 శాతం సుంకం విధిస్తామని, జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈయూతో జరిపిన చర్చలు ఫలవంతం కాలేదని, చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి: