Russia- Ukrain : రష్యాపై ఉక్రెయిన్ దాడులు.. ఎయిర్పోర్టుల మూసివేత

Ukraine’s attacks on Russia : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య దాడులు కొనసాగుతుండగా, తాజాగా మాస్కోలోని పలు ప్రాంతాలపై కీవ్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. తమ బలగాలు 9 డ్రోన్లను నేలకూల్చాయని వెల్లడించారు. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్పై డ్రోన్లు విరుచుకుపడడంతో మంటలు చెలరేగి పలువురు గాయాలపాలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్ దాడులతో ముందు జాగ్రత్త చర్యగా వ్నుకోవో, డొమోడెడోవో ఎయిర్పోర్టులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
దీంతో పలు విమానాలు రద్దయ్యాయని, మరికొన్నింటిని ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించామన్నారు. దాడులతో ఎంత నష్టం వాటిల్లిందనే విషయాన్ని ధ్రువీకరించలేదు. రష్యా సైతం ఉక్రెయిన్పై ప్రతిదాడులకు పాల్పడడంతో పలు ప్రాంతాల్లో నివాస భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధానికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. యుద్ధం ముగించి ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు యుద్ధ నివారణకు ఇస్తాంబుల్ వేదికగా రెండుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఇరుదేశాలు తమ సైనిక బలాన్ని, ఆయుధ వ్యవస్థను పెంచుకోవడం గమనార్హం.