India Pakistan Ceasefire: ప్రపంచం ముందు ఏకాకిగా పాకిస్తాన్.. భారత్ వైపే ప్రపంచ దేశాలు

India Pakistan Ceasefire: పహెల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ కు వరుస దెబ్బలు తగిలాయి.ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిదైంది. చైనా, టర్కీ మద్దతు ఇచ్చినా, అది పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా పదుల సంఖ్యల్ ఉన్న ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ను దూరం అయ్యాయి.
ఆపరేషన్ సిందూర్..
భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ నిలిచింది. ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము సహించేది లేదని భారత దేశం ప్రపంచానికి చాటింది ఆపరేషన్ సింధూర్ తోనే. ఆపరేషన్ సింధూర్ తో పహెల్ గాం దాడి తరువాత భారత్ తమను ఏమీ చేయలేదని భ్రమల్లో ఉన్న పాకిస్తాన్ గుణపాఠం చెప్పింది. ఇటు పాకిస్తాన్.. అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు విజయవంతంగా నేలకూల్చాయి.
ఒంటరిగా పాక్
ఆపరేషన్ సింధూర్ తరువాత అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ దాదాపు ఒంటరిగా మిగిలింది. ఉగ్రవాదానికి పలుమార్లు దాడికి గురి అవుతున్న భారత దేశానికి గాను.. ప్రపంచ దేశాలు వాటి మద్దతును భారత్ కు తెలియజేశాయి. అయితే అదేసమయంలో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు ఇచ్చిన దేశాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇందులో మొదటిది చైనా, పాకిస్తాన్ తో చైనా కు చాలా కాలం నుంచి దోస్తానా ఉంది. ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ కు చైనా అప్పుడప్పుడు రుణాలు ఇచ్చి ఆదుకుంటోంది. అంతేకాదు పాకిస్తాన్ కు చైనా మద్దతు ఇవ్వడం వెనుక ఒక వ్యూహం కూడా ఉందండోయ్!
చైనా పోకడలు..
ఆసియాలో పెద్దన్నపాత్ర పోషించడానికి కొంతకాలంగా చైనా తహతహలాడుతోంది. దీంతో ఆసియాలోని చిన్నచిన్న దేశాలకు రుణాలు ఇచ్చి అక్కున చేర్చుకుంటోంది. ఏదైనా కష్టం వస్తే తాను సాయం చేస్తానన్న బిల్డప్ ఈ దేశాల దగ్గర ఇస్తోంది. ఇలా ఆసియాలోని దాదాపు చిన్న చిన్న దేశాలన్నిటినీ అప్పుల ఊబిలో దించుంతోంది చైనా. ఇదిలా ఉంటే చైనా ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకుంటోంది భారతదేశం ఒక్కటే. మిగతా దేశాలకు అంత సీన్ లేదు. దీంతో ఏదో విధంగా భారత్ ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయింది చైనా. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా తొండాట అడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పాకిస్తాన్ కు బహిరంగంగా సపోర్ట్ ఇచ్చింది చైనా.
టర్కీ సపోర్ట్..
ఇక రెండో దేశం టర్కీ. తర్కియాగా ప్రపంచ రాజకీయాల్లో ఈ దేశం పాపులర్. వాస్తవానికి ఇదొక చిన్న ముస్లిం దేశం. కొన్నేళ్ల కిందట టర్కీలో పెను భూకంపం వచ్చింది. లక్షలాది మంది చనిపోయారు. టర్కీ పరిస్థితి చూసి చలించిన భారత్ వెంటనే ఆ దేశానికి మానవతా దృక్పధంతో సాయం చేసింది. ప్రత్యేక విమానాల్లో టన్నుల కొద్దీ సహాయ సామగ్రి పంపింది. అయితే భూకంపం సమయంలో భారత్ చేసిన సాయాన్ని టర్కీ మరచిపోయింది. పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది. అంతేకాదు పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున డ్రోన్లు కూడా సాయం చేసిందంటారు రక్షణ రంగ నిపుణులు.
రహస్యంగా పాక్- అమెరికా..
ఇదిలా ఉంటే పాకిస్తాన్ కు మొదట్నుంచి అమెరికా అండదండలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. దీంతో అమెరికా కనుసన్నల్లో నడిచే పశ్చిమదేశాలన్నీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తాయని ఇస్లామాబాద్ లెక్కలు వేసుకుంది. అయితే ఇస్లామాబాద్ లెక్కలు తప్పు అని పశ్చిమ దేశాలు తేల్చి చెప్పాయి. ఉగ్రవాదానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కు దూరంగా జరిగాయి పశ్చిమ దేశాలు.
మతాన్ని నమ్ముకున్న పాక్..
కాగా ఈసారి ముస్లిం దేశాలపై పాకిస్తాన్ బోలెడు ఆశలు పెట్టుకుంది. మత ప్రాతిపదికన ముస్లిం దేశాలన్నీ కూడబలుక్కుని తమకు మద్దతు ఇస్తాయని పాకిస్తాన్ లెక్కలు వేసుకుంది. అయితే అలాంటిదేమీ జరగలేదు.పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే విషయంలో మౌనాన్నే ఆశ్రయించాయి. ఉగ్రవాదాన్ని తాము కూడా సహించబోమని ముస్లిం దేశాలు తేల్చి చెప్పాయి.
ఏకాకిగా పాక్..
అలా నిన్నటి వరకు ప్రపంచ దేశాల మద్దతు తమకే ఉంటుందని విర్రవీగిన పాకిస్తాన్ కు శృంగభంగమైంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ ఏకాకిగా మారింది.