Protest in Los Angeles: లాస్ ఏంజెల్స్ అల్లర్లు.. 2 వేల మంది గార్డ్స్ తరలింపు
Protest in Los Angeles: లాస్ ఏంజెల్స్ నగరంలో అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలో అల్లర్లను చల్చార్చేందుకు మరో రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
గత మూడు రోజులుగా లాస్ ఏంజెల్స్ నగరం తగలబడుతూనే ఉంది. అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ అగ్గి రాజుకుంది. ఫెడరల్ అధికారులు చేపట్టిన తనిఖీలకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు రోడ్లమీదకు వచ్చారు.నిరసన ప్రదర్శనలు చేపట్టారు. లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ లో అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆందోళనకారులు రెచ్చిపోయారు. రోడ్ల మీద కనిపించిన ప్రతి వాహనానికి నిప్పు పెట్టారు. అంతేకాదు పోలీసు వాహనాలకు కూడా అగ్గి పెట్టారు.
నలభై లక్షల జనాభా ఉన్న లాస్ ఏంజెల్స్ లోని డౌన్ టౌన్ తాజా అల్లర్లకు కేంద్రంగా నిలిచింది. అక్కడ జాతీయ రహదారి సహా అనేక మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధం చేశారు. కాగా ఒక్కసారిగా నేషనల్ గార్డ్స్ రావడంతో ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. అయితే డజన్ల కొద్దీ ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మిగిలిన వారిని అరెస్టు చేయడానికి వెళితే, వారిపైకి కాంక్రీట్ ముక్కలను,రాళ్లను ఆందోళనకారులు విసిరారు.ఈ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ కు తరలించింది ట్రంప్ సర్కార్. అయితే ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.దీంతో మరో రెండు వేలమంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ కు తరలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
కాగా నేషనల్ గార్డ్స్ కు సహాయంగా 700 మంది మెరైన్ లను లాస్ ఏంజెల్స్ నగరంలో మోహరించింది పెంటగాన్. ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ అధికారులను, వారి ఆస్తులను పరిరక్షించడం ఈ మెరైన్ ల బాధ్యత. కాగా సహజంగా మెరైన్ ల సేవలను యుద్ధాల్లో వినియోగించుకుంటారు. అయితే ఇప్పుడు ఏకంగా స్వంత దేశస్తులకు వ్యతిరేకంగా మెరైన్ లను మోహరించింది ట్రంప్ ప్రభుత్వం. అమెరికా రాజకీయాల్లో ఇదొక కొత్త సంప్రదాయం కిందే లెక్క. కాగా ఇదే విషయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ లేవనెత్తారు. ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ తూర్పార బట్టారు.
లాస్ ఏంజెల్స్ …ఈ పేరు వినగానే చాలా మంది హాలీవుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి.అంతేకాదు ప్రకృతి అందాలకు కూడా లాస్ ఏంజెల్స్ కేరాఫ్ అడ్రస్ కిందే లెక్క. అయితే అనేక ఆందోళనలకు కేంద్రంగా ఉన్న చరిత్ర కూడా లాస్ ఏంజెల్స్ కు ఉంది. 1968లో మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు లాస్ ఏంజెల్స్ లో ఉద్యమించారు. దాదాపు 15 వేల మంది మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.శ్వేత జాతికి చెందిన విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించే అమెరికన్ ప్రభుత్వం తమపై శీతకన్ను వేసిందని ఆరోపించారు. తమకు కేవలం ఒకేషనల్ శిక్షణతోనే ప్రభుత్వం సరిపెడుతోందని మండిపడ్డారు. అప్పట్లో మెక్సికన్ అమెరికన్ విద్యార్థుల నిరసనలను బ్లో అవుట్ లుగా పిలిచేవారు.ఈ ఆందోళనలే ఆ తరువాత జరిగిన షికానో పౌర హక్కుల ఉద్యమానికి నాంది పలికింది.
1992 లో జరిగిన రాడ్నీ కింగ్ నిరసన యావత్ లాస్ ఏంజెల్స్ ను అతలా కుతలం చేసింది. 1991లో ఆఫ్రో అమెరికన్ అయిన మోటారిస్టు రాడ్నీ కింగ్ ను నలుగురు శ్వేతజాతి పోలీసు అధికారులు దారుణంగా హింసించారు. ఈ ఘటన యావత్ లాస్ ఏంజెల్స్ ను కుదిపేసింది. కాగా ఈ దారుణ ఘటనపై చివరకు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.నలుగురు శ్వేతజాతి పోలీసు అధికారులను నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో తీర్పునకు వ్యతిరేకంగా లాస్ ఏంజెల్స్ భగ్గున మండిపోయింది. దాదాపు వారం రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల ఫలితంగా 50 మంది చనిపో్గా , రెండు వేల మంది గాయపడ్డారు.
అలాగే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి లాస్ ఏంజెల్స్ వేదికగా నిలిచింది. జార్జ్ ఫ్లాయిడ్ ఒక ఆఫ్రో – అమెరికన్.అయితే ఈ జార్జ్ ఫ్లాయిడ్ ను ఒక పోలీసు అధికారి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.దీంతో లాస్ ఏంజెల్స్ మరో్సారి అట్టుడుకింది. బ్యాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో…పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనలకు లాస్ ఏంజెల్స్ కేంద్రంగా నిలిచింది. అంతేకాదు ఈ ఆందోళనల ఫలితంగా అనేక ప్రాంతాల్లో లూటీలు కూడా జరిగాయి.దీంతో ఒక దశలో కర్ఫ్యూ విధించారు.అంతేకాదు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. కారణాలు ఏమైనా, అందాల నగరం లాస్ ఏంజెల్స్ మరో్సారి తగలబడుతోంది. ఆందోళనలకు కేంద్రంగా మారింది.